వెల్లింగ్టన్: ఐసీసీ ఎమర్జెంగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2018, టీమిండియా యువ సంచలన ఆటగాడు రిషభ్ పంత్పై ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రేపట్నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్కు టీమిండియా ఆటగాళ్లు సమయాత్తమవుతున్నారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ ఓ ప్రముఖ జాతీయ చానల్కిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రిషభ్ పంత్ను తన పొగడ్తలతో ముంచెత్తాడు. పంత్ చాల దూకుడైన ఆటగాడని పేర్కొన్న ధావన్ ఓవర్ వ్యవధిలోనే ప్రత్యర్థి చేతుల్లోంచి మ్యాచ్ను లాగేయగలడని ప్రశంసించాడు. పంత్ టీమిండియాకు దొరికిన అత్యంత విలువైన ఆస్తి అంటూ కితాబిచ్చాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో దొరికిన అవకాశాన్ని రెండు చేతులా పంత్ అందిపుచ్చుకుంటాడనే నమ్మకం ఉందన్నాడు. అలవోకగా మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం అతడి సొంతమంటూ పంత్పై ధావన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంత్ ట్యాలెంట్ గురించి చెప్పాలంటే ఇంకా చాలానే ఉందని, కాని ముందుముందు అభిమానులే గ్రహిస్తారన్నాడు.
విజయంతోనే ముగించాలి
కివీస్ పర్యటనను విజయంతోనే ముగించాలని భావిస్తున్నామని ధావన్ పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్ను గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నామన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో కివీస్తో జరగనున్న టీ20 సిరీస్ను కైవసం చేసుకుంటే టీమిండియా ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందన్నాడు. అలాగని కివీస్ జట్టును తక్కువ అంచనా వేయటం లేదని ధావన్ తెలిపాడు. బుధవారం నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్లో పంత్కు దాదాపుగా అవకాశం లభించినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ను పక్కకు పెట్టే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉంది. అంతే కాకుండా పాండ్యా బ్రదర్స్కు కూడా జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వన్డే సిరీస్ గెలిచిన ఉత్సాహంలోనే టీ20 సిరీస్ను కూడా కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక కనీసం టీ20 సిరీసైనైనా గెలుచుకోవాలనే ఆలోచన ఆతిథ్య కివీస్ జట్టు ఉంది.